Thursday, April 6, 2017

మధుర ఫలానికి మరకలు ......

                                     మధుర ఫలానికి మరకలు 

తినడానికి వెనుకడుగు వేస్తున్న ప్రజలు 
రసాయనాలతో మెరుగులు 
పండ్లలో రారాజు మామిడి. మధురఫలంగా అందరి మనసు దోచిన మామిడి పండుపైన మరక పడుతోంది. ఇది మామిడిని అమితంగా ఇష్టపడే వారిని ఆలోచింపజేస్తోంది. చూడగానే కొనాలనిపిస్తోన్నా.. ఆ పండు సహజంగా పండిందా.. లేక రసాయనాలతో విషతుల్యం అయ్యిందా అనే అనుమానం తలెత్తి ఆఖరుకు మామిడికి దూరం అయ్యేలా చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. సహజంగా పండిన పండుకు బంగారు వర్ణం రాదు. ఇది ఆహార పరీక్షలు చేసే మార్కెటింగ్‌ అధికారులకు తెలుసు. నగరంలో ఏబండి మీద చూసినా.. బంగారు వర్ణంతో కాంతులీనుతున్న మామిడిపళ్లు కనిపిస్తున్నా.. వాటిని తనిఖీ చేసి.. కృత్రిమంగా మగ్గబెడుతున్నవారిపై చర్యలకు ఉపక్రమించుకండా.. ప్రజల జీవితాలతో ప్రభుత్వ యంత్రాంగం ఆటలాడుకుంటోంది.
రైతుకు ఏ పాపం తెలియదు.. పండిన పంటను మార్కెట్‌కు తరలించి.. వచ్చిన డబ్బులను ఇంటికి తీసుకెళ్లడం తప్ప. వినియోగదారుడికి అస్సలు ఏమీ తెలియదు.. దారినపోయినప్పుడు బంగారు వర్ణంలో మెరిసిపోయే మామిడిపళ్లను చూసి కొనడం తప్ప. ఏదైనా మాట్లాడితే.. కాస్త రేటు తక్కువ చేయమని కోరుతాడు.. ఇటీవల తోపుడు బళ్లమీద రేటు కార్డు వేలాడేసి మరీ అమ్ముతుండడంతో ఎంత చెబితే అంతకు కొనుక్కొని వెళ్తున్నారు. ఎటొచ్చీ.. మార్కెట్‌ నుంచి మామిడి కాయలను టోకుగా కొని.. రిటైల్‌గా అమ్మాలనుకునే మధ్య దళారీనే మాయాజాలానికి పాల్పడుతున్నాడు. హానికరమైన రసాయనాలతో మగ్గబెట్టి.. మధురఫలం మామిడి పండును విషతుల్యం చేస్తున్నాడు. సీజన్‌ కావడంతో మామిడి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు పోటెత్తుతోంది. ఇదే అదునుగా దళారీలు వ్యాపారులు కుమ్మక్కై కాయలను పండ్లుగా మగ్గించడానికి రసాయనంతో కూడిన పౌడరు ప్యాకెట్లను మామిడితో జతచేసి రవాణా చేస్తున్నారు.

రెండు మూడు రోజులకే..
సహజంగా పక్వానికి వచ్చిన కాయ పండు అవ్వాలంటే.. గడ్డిలో మాగబెడితే వారం నుంచి 10 రోజులకు పండు అవుతుంది. కాని రసాయనాలు వేయడం వల్ల.. రెండు మూడు రోజులకే పండుగా మారుతోంది. రవాణా చేయడానికి అనువుగా ప్లాస్టిక్‌ ట్రేలల్లో ఒక వరుస మామిడి కాయలు వాటిపై రసాయన పౌడర్‌ ప్యాకెట్లు రెండు పెట్టి పలు ప్రాంతాలతోపాటు ఇతర రాష్టాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఇవి రెండు మూడు రోజులకే బంగారు వర్ణాన్ని సంతరించుకొని వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

రూటు మార్చిన వ్యాపారులు.. 

నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌నే వేదికగా చేసుకుని ఇదివరకు.. రసాయనాలను వాడిన వ్యాపారులు ఇప్పుడు రూటు మార్చారు. నగర శివార్లలోని గోదాములకు తీసుకెళ్లి అక్కడ రసాయనాలు చల్లుతున్నారు. యార్డులో విక్రయాలు జరగ్గానే కొనుగోలు చేసిన వ్యాపారులు కాయలను రవాణా చేయడానికి అవసరమైన కూలీలను, ప్లాస్టిక్‌ ట్రేలను సిద్ధంగా ఉంచుకుని మామిడి కాయలకు ఈ ప్యాకెట్లను జత చేసి లారీల్లో ఉత్తరాది రాష్ట్రాలతోపాటు నగరంలోని పలు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు మంగళవారం 1990 క్విటాళ్ల మామిడి కాయలు అమ్మడానికి వచ్చినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపారు.
రసాయనాలు వాడొద్దంటూ వ్యాపారులకు సూచించాం 

- ఎల్లయ్య, గడ్డిఅన్నారం పండ్ల 
మార్కెట్‌ స్పెషల్‌గ్రేడ్‌ సెక్రటరీ(ఎస్‌జీఎస్‌) 
కార్బైడ్‌ స్థానంలో చైనా పౌడర్‌ వినియోగిస్తున్న విషయం మా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పటికే వ్యాపారులతో సమావేశమయ్యాం. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయనాలను వాడి మగ్గపెట్టడాన్ని సహించం. గతేడాది దాడులు చేసి ఏడుగురి లైసెన్సులు రద్దు చేశాం. ఈ సారి కూడా అప్రమత్తంగా ఉన్నాం. మార్కెట్‌ సిబ్బంది నిరంతరం నిఘా పెట్టి మరీ తనిఖీలు చేస్తున్నాం. 
                        కార్బైడ్‌ స్థానంలో చైనా పౌడర్‌..
తెల్లటి ప్యాకెట్లో.. ఈ రసాయనం కనిపిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ ప్యాకెట్‌ మీద ఎక్కడ తయారు చేశారో ఎలాంటి వివరాలుండవు.. ముంబయి నుంచి వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చైనా పౌడర్‌ అని పిలుస్తున్నారు. ఉత్తి ప్యాకెట్‌పై ఇత్లెయిన్‌ ఫ్రూట్‌ రైపనర్‌ అని మాత్రమే రాసి ఉంది. ఈ ప్యాకెట్లు ఒక్కో వరుసకు రెండు చొప్పున వేస్తే.. రెండు, మూడు రోజులకు పండ్లు అయిపోతున్నాయి. గతంలో కాల్షియం కార్బైడ్‌ వినియోగించిన వారు ఇప్పుడు చైనా ప్యాకెట్లను వాడుతున్నారు. ‘పండు ఆరోగ్యానికి పుండు’ శీర్షికతో ‘ఈనాడు’లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి.. ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో యంత్రాంగం ఆగమేఘాలపై మార్కెట్లో తనిఖీలు చేపట్టి ఏడుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వ్యాపారులు తమ పంథాను మార్చుకున్నారు. కాల్షియం కార్బైడ్‌కు బదులు చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇత్లెయిన్‌ ఫ్రూట్‌ రైపనర్‌ ప్యాకెట్లను వినియోగిస్తున్నారు.

.

No comments:

Post a Comment